మంచేరియల్, 2026-07-25
10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరగడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య తో కలిసి యు - డైస్ ఆన్లైన్ పోర్టల్లో విద్యార్థుల నమోదు నివేదికను విడుదల చేశారు.
10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య తో కలిసి యు - డైస్ ఆన్లైన్ పోర్టల్లో జూలై 25, 2026 నాటి విద్యార్థుల నమోదు నివేదికను విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో నమోదైన విద్యార్థుల సంఖ్య కంటే 10 శాతం అదనపు విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిందని, గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులు ఉండగా, 2026-27 విద్యా సంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని వివరించారు.
ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే 2,278 మంది అదనంగా చేరారని తెలిపారు. దీంతో 10 శాతం అదనపు నమోదు లక్ష్యంలో 95.72 శాతం సాధించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ స్థానంలో, జగిత్యాల జిల్లా 3వ స్థానంలో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 శాతం కంటే అధిక విద్యార్థుల నమోదును సాధించాయని తెలిపారు. మండలాల వారీగా మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, హాజీపూర్ 99.91 శాతం, నస్పూర్ 99.76 శాతం, భీమారం 98.24 శాతం, నెన్నెల్ 98 శాతం అత్యుత్తమ పురోగతి సాధించాయని పేర్కొన్నారు. మొత్తం 18 మండలాలలో 10 మండలాలు 96 నుంచి 100 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకున్నాయని తెలిపారు.
జూలై 23 నాటి యు - డైస్ గణాంకాల ప్రకారం 3,352 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలలో చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (స్మార్ట్ టీవీలు), ఐ.సి.టి. కంప్యూటర్ ల్యాబ్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరంలో 82 పాఠశాలలలో కంప్యూటర్ బోధకులను నియమించడం జరిగిందని తెలిపారు.
పాఠశాలలలో మౌలిక వసతులు బలోపేతం చేయడంతో పాటు 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. బాలికలు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, అవసరమైన వసతి గృహ, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని కోరారు.












