రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది కోసం సోమవారం పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పోలీసుల నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, మూడవ పోలీస్ డ్యూటీ మీట్–2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మీట్లో భాగంగా, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ-సబోటేజ్ తనిఖీలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించబడ్డాయి.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ వంటి అంశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కేసుల దర్యాప్తులో నూతన మెళకువలను నేర్చుకోవడానికి, సంక్లిష్టమైన కేసుల పరిష్కారానికి అవసరమైన ఆలోచనలను పంచుకోవడానికి ఈ మీట్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ డ్యూటీ మీట్ అనేది పోలీసుల వృత్తిపరమైన పనితీరు మరియు సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక అని సీపీ అభివర్ణించారు. వివిధ ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య పరస్పర సహకారం, ప్రోత్సాహం కూడా ఈ కార్యక్రమం ద్వారా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపికైన వారు కాళేశ్వరం జోన్, రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏఓ శ్రీనివాస్, పలువురు ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సీఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.











