గ్రామస్థాయి నుండి అభివృద్ధి దిశగా నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని, అందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి ఆయన గ్రామ అభివృద్ధి ప్రణాళికపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, పెసా గ్రామపంచాయతీలు, సభాసర్, నిర్ణయ్ యాప్, ఈ-గ్రామ స్వరాజ్ అంశాలపై అవగాహన కల్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించేలా గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరు కావాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని, గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని, పన్నులు సకాలంలో వసూలు చేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యాలయ భవనం ఉండాలని, భవనాలు లేని చోట్ల అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా, దోమల వృద్ధిని అరికట్టే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ప్రణాళికలు అత్యంత ఆవశ్యకమని, ఈ దిశగా అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.జి.జి. కన్సల్టెంట్ మహేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.










