తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, వారి త్యాగాలు, కృషి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కళాకారులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లడంలో కళాకారుల పాత్ర కీలకమైందన్నారు. పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమ విజయానికి వారు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


