కులగణన చేపట్టవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీసీ సమాజ్ స్వాగతించింది. ఈ తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు.
బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓబీసీ కుటుంబాల లెక్కింపును చేపట్టాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా బీసీ జనాభాను అధికారికంగా లెక్కించాలని, జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలని బీసీ సమాజాలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాట ఫలితమే ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని, ప్రభుత్వాలు సంక్షేమ విధానాలు రూపొందించాలంటే కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడాన్ని ఆయన స్వాగతించారు. వెనుకబడిన వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని ఆయన అన్నారు.
కులగణన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసిందని విమర్శించిన శ్రీనివాస్, సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రస్తుతం జరుగుతున్న కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల వివరాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా లెక్కలను సుప్రీంకోర్టు సమర్థించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా నాయకులు మెంత్యాల సంతోష్, కుడుకా మోహన్, తాటిపాముల సమ్మయ్య, బోట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.











