జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి 62 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 1 కారు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ నవీన్ కుమార్ హెచ్చరించారు.
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామంలో జైపూర్ ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా 62 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 1 కారు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా, విక్రయం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, సోషల్ మీడియా భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-112 సేవలు, గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపులో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు మరియు నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలు, శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతలను పరిరక్షించడం, పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












