మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్ సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పోలీస్ కమిషనర్ విద్యార్థుల క్రమశిక్షణను ప్రశంసించారు. మంచి విలువలు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడరని, అందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
విద్యార్థులు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ 'యాంటీ డ్రగ్ సోల్జర్స్'గా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు మొదట్లో ఆకర్షణీయంగా కనిపించినా, అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని, కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ఇటువంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కష్టపడి పనిచేయాలని, క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












