నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అత్యవసరమని, నిరంతర పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. శనివారం ఆయన మందమర్రి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీసీపీ, స్టేషన్ పరిసరాలను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ రికార్డులను తనిఖీ చేసి, కేసుల పురోగతి, రౌడీషీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించిన డీసీపీ, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలను అరికట్టవచ్చని ఆయన నొక్కి చెప్పారు.
సిబ్బందితో సమావేశమైన డీసీపీ, వారి సమస్యలను ఆలకించారు. స్టేషన్ పరిధిలోని వివిధ అంశాలపై సీఐ రమేష్ డీసీపీకి వివరించారు. ఈ తనిఖీలలో ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమేష్, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు.












