Nirmal/Kadam (Peddur) (ప్రజావార్త) జూలై 14
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోషిక మాధవి ఆత్మహత్య కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్తో పాటు అతని తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోషిక మాధవి ఆత్మహత్య కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్తో పాటు అతని తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అదుపులోకి తీసుకుని నేర ఒప్పుకోలు పంచనామా నిర్వహించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎస్సై భూమేష్తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్ కీలక విషయాలను వెల్లడించినట్లు సీఐ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం గోషిక మాధవితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయాన్ని ప్రేమగా భావించి ఆమె అంగీకరించకపోయినా నిరంతరం వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలిపాడని తెలిపారు. మాధవి పలుమార్లు తిరస్కరించినప్పటికీ ఆమెను వదలకుండా వేధించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని తన తల్లి శంకరమ్మ, అక్క శైలజకు చెప్పగా, వారు కూడా "ఆమెను వదలొద్దు.. అలాగే ప్రయత్నిస్తే చివరకు పెళ్లి జరుగుతుంది" అంటూ తనను ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడించినట్లు పంచనామాలో పేర్కొన్నారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేయాలని కోరగా, కుల భేదాలు చూపిస్తూ యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారని పేర్కొన్నారు. దీంతో పెళ్లి చేయకపోతే ఆమె పేరుతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జూలై 10న గోదావరిఖనిలో మాధవిని కలసి మరోసారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు వెల్లడించాడు. జూలై 11న పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలోనూ యువతి కుటుంబం వివాహానికి నిరాకరించడంతో, తన తల్లి, అక్క కలిసి "మా వాడికి ఏదైనా జరిగితే ఊరుకోం" అంటూ బెదిరించినట్లు విచారణలో పేర్కొన్నారు.
నిందితుడు వెంకటేష్ వద్ద ఉన్న వివో కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ ద్వారానే మాధవికి తరచూ కాల్స్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, ఫోన్ను స్వాధీనం చేసుకుని సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు పంచనామాలో వెల్లడించారు. అనంతరం శంకరమ్మ, శైలజల వాంగ్మూలాలు కూడా నమోదు చేయగా, వారు కూడా ప్రధాన నిందితుడు తెలిపిన వివరాలనే ధృవీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో సేకరించిన సాక్ష్యాలు, సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ వివరాలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.










